'సహితస్య భావం సాహిత్యం' - సమాజ హితాన్ని కోరుతూ సృజించబడేది సాహిత్యం. మానవులకు మానసికమైన ఆనందంతో పాటు, వ్యవహార జ్ఞానాన్ని చేకూర్చే సుధారసం సాహిత్యం. అట్టి సాహిత్య విషయంలో "ఎలాంటి వివాదాలకు తావులేకుండా వివిధ భావవాదాలకు వేదిక" గా ప్రముఖ రచయిత అంగరవెంకట కృష్ణారావు గారి శుభ సంకల్పంగా 04-04-1971, ఉగాది రోజున 'విశాఖ సాహితి' ఆవిర్భవించింది.
కళాప్రపూర్ణ శ్రీ గజపతిరాజు అచ్యుతరామరాజుగారు గౌరవాధ్యక్షులుగా ప్రసిద్ధ నవలాకారులు శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావుగారు అధ్యక్షులుగా, కథకులు శ్రీ మల్లాప్రగడ రామారావుగారు కార్యదర్శిగా రూపుదిద్దుకున్న ఈ విశాఖ సాహితికి 'వాక్యం రసాత్మకం కావ్యం' అనే రమణీయమైన సూక్తితో సుప్రసిద్ధ చిత్రకారులు బాపుగారు అర్ధవంతమైన చిహ్నాన్ని (లోగో) చిత్రించారు మనోహరంగా.
1977 నుండి కళాప్రపూర్ణ శ్రీ గజపతిరాజు అచ్యుతరామరాజుగారు అధ్యక్షులుగా, సుప్రసిద్ధ కథకులు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, శ్రీ భరాగో, శ్రీ కోశానా, శ్రీ నవులూరు వెంకటేశ్వరరావు, శ్రీ ఏ.యస్వీ.రమణారావు, ష్టి శ్రీహరిరాజు, శ్రీ జంపన కుమారవర్మ, శ్రీ కావిలిపాటి నారాయణరావు ప్రభృతులు కార్యదర్సులుగా విశాఖ సాహితి కార్యక్రమాలను ఉన్నతంగా నడిపించారు.